July 27, 2024

దేవునికి సహచరుల్ని కల్పించి పూజించే ఆచారం దాదాపు అన్ని దేశాలలోనూ కనబడుతుంది. అవి సూర్య చంద్ర నక్షత్రాలయినా కావచ్చు, పాము వంటి విషపురుగులైనా అవ్వచ్చు, కుక్క, పంది, నక్క, గాడిద ఆకారాలయినా అవ్వచ్చు, అగ్ని, వాయువు, జలం అయినా కావచ్చు,  దైవ దూతలు, జిన్నాతులు, మహనీయులు, దైవప్రవక్తలు అయినా అవ్వచ్చు లేక భౌతిక పదార్థాలు, ఆధ్యాత్మిక సంబంధమైన పదార్థాలయినా అయివుండొచ్చు. ఇవన్నీ షిర్క్‌ కోవకు చెందినవే. ఇది ముమ్మాటికి విశ్వకర్త అయిన అల్లాహ్ పట్ల విద్రోహం, తిరుగుబాటే. అందుకే దాన్ని మహా పాతకమని, ఘోర నేరమని, భయంకర పాపమని.  క్షంతవ్యం కానిదని అభివర్ణించడం జరిగింది.

‘ఏమిటి? ఏ వస్తువునూ సృష్టించలేని వారినీ, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారినా వీళ్ళు (అల్లాహ్ కు) భాగస్వాము లుగా నిలబెడుతున్నది? వారు వీళ్ళకు ఏ సహాయమూ చేయలేరు.  కనీసం  తమకు తాము కూడా  ఏ సహాయం చేసుకోలేరు’.  (ఆరాఫ్‌ : 191,192)

అంటే- క్రైస్తవంలో మాదిరి ‘త్రిత్వం’ (Trinity)) సిద్ధాంతంగానీ, భారతదేశంలో వంటి ‘త్రిమూర్తుల’ విశ్వాసంగానీ, మార్గం మరచిన   ముస్లింలలోని, దర్గాలు,  మనోరంజక ఊరేగింపులు, ఉరుసులు, సమాధుల  సమక్షంలో సజ్దాలు, సమాధుల్ని సిల్కు దుప్పట్లతో, పూలమాలలతో అలంకరించడాలు, సమాధుల పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించేందుకు అక్కడ పాట కచేరీలు, ఖవ్వాలీలు, తుర్బత్‌లు, జాఫర్‌ మట్కాలు (జాఫర్‌ కె కుండె), జెండా తీయడాలు, సదింపులు, రొట్టెలు వదలడాలుగానీ – అన్నీ షిర్క్‌ క్రిందికే వస్తాయి. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. షిర్క్‌ (బహు దైవారాధన), కుఫ్ర్‌ (దైవ తిరస్కారం, ధిక్కారం), ఇల్‌హాద్‌ (ధర్మరాహిత్యం) నాస్తికత్వం- షిర్క్ లలోని అంతర్భాగాలే. అన్నింటి లోనూ ఒక్కటే భావం- దైవ విద్రోహం, అల్లాహ్ పట్ల తిరుగుబాటు. చిన్న తేడా అంతే- బహుదైవారాధకులు ఇష్టమైన వాటిని దైవాలుగా, దేవునికి సహవర్తులుగా కొలుస్తారు. నాస్తికులు తామే దైవం అన్నట్టు వ్యవహరిస్తారు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:

‘‘మీరు అల్లాహ్ ను వదలి ఎవరెవరిని మొర పెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే, మానవులే’. (ఆరాఫ్‌: 194)

(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: ‘‘భూసముద్రాలపై అలుముకున్న చీకట్లలో నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడు? ఆయన గనక మిమ్మల్ని ఈ ఆపద నుండి రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామని కడు దీనంగా లోలోపలే మీరు ఎవరిని వేడుకుంటారు? విపత్తు నుండి, అన్ని రకాల దుఃఖాల నుండి, బాధల నుండి మీకు విముక్తి నొసగేవాడు అల్లాహ్ యే. అయినా సరే మీరు (మేలును మరచిపోయి) బహు దైవారాధనకు ఒడిగడుతున్నారు’. (అల్‌ అన్‌ఆమ్‌ : 63, 64)

‘ఎవరైతే అల్లాహ్ ను కాకుండా ఇతరులను సంరక్షకులుగా (భ్రమించి) ఆశ్రయించారో వారు, ‘ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చడంలో తోడ్పడతారని భావించి మేము వీళ్ళను ఆరాధిస్తున్నామ’ని తమ(వాదన)ల్ని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తారు’. (జుమర్‌: 3)

బరి తెగించిన మరికొందరైతే- మనుషుల్ని చేసినందుకు దేవుడు సంతాపము నొంది నొచ్చుకున్నాడనీ, మానవులు తన శక్తి పరిధిని దాటి పోతున్నారనీ, దానికి మూలం వారందరి  భాష ఒకటే అవ్వడం అనీ, అలానే వారిని వదిలేస్తే వారు ఎదిగిపోతారనీ వారికి ఏదీ ఆటంకం కాజాలదని భయపడి, వారి భాషను విడగొట్టాడనీ, భూమి మీద బాషలను తారుమారు చేసి వారిని చెదరగొట్టాడని, అప్పుడు మానవులు ప్రగతి చర్యలను మానుకున్నారని కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. వారు ఎంతటి అభాండాన్ని అల్లాహ్ మీద మోపుతున్నారో వారికే తెలీదు. అల్లాహ్ ఇట్టి ఊహాజనిత సిద్ధాంతాలకు అతీతుడు, పరమ పవిత్రుడు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:

‘ఆకాశాలలో, భూమిలో ఉన్నవారంతా (తమ అవసరాలు తీరడానికి) ఆయన్నే అర్థిస్తున్నారు. ప్రతిదినం ఆయన ఓ (వినూత్న) వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు’. (రహ్మాన్‌: 29)

విశ్వమండలంలోని ఈ వ్యవస్థ ఉత్థాన పతనాల తెరల వెనుక క్రియాత్మక పాత్రను పోషించేది ఆ విశ్వకర్తే. ఆయన ప్రణాళికను అనుసరించే ఈ విశ్వ వ్యవస్థ నడుస్తోంది. రేయింబవళ్ళలో ఏ ఒక్క క్షణం కూడా ఆయన ప్రమేయం లేకుండా ఏదీ జరుగదు. ఆయన అజరుడు, అమరుడు, నిత్యుడు,  సజీవుడు. సకల చరాచర సృష్టికి ఆయనే  మూలాధారం. ఆయన  ఆజ్ఞల  పరిధి  నుండి తప్పించుకు పారిపోయే శక్తి ఎవ్వరికీ లేదు.

‘‘ఓ జిన్నులారా! ఓ మానవ సమూహానికి చెందినవారలారా! మీలో ఎవరికయినా భూమ్యాకాశాల అంచుల నుండి పారి పోయే శక్తి  ఉంటే  పారిపోయి చూడండి!’’. (రహ్మాన్‌: 33)

అల్లాహ్ ఆజ్ఞల పరిధి నుండి పారిపోయే శక్తి ఎవరిలో ఉందనీ?!  ఒకవేళ పారిపోయినా ఎందాక పోతారు? అల్లాహ్ అదుపులో లేని భూభాగం ఎక్కడుంది? మరి అట్టి సార్వభౌమాధికారి మానవులకు భయపడటమా? ఎంత విడ్డూరం! నిజం చెప్పాలంటే రంగుల వ్యత్యాసం గానీ,  విభిన్న  భాషలుగానీ  ఆయన సూచనల్లోనివే.

అదే విధంగా – కొందరు దేవుని వీపుని (వెనుక పార్శ్యమును) చూచారని, కొందరు తమ స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా దైవంతో సంభాషించారని, దేవుడు ఆరు దినాల్లో భూమ్యాకాశాలను, సముద్రములను, వాటిలోని సమస్తాన్ని  సృజించి (అలసిసొలసి) విశ్రాంతి తీసుకున్నాడని, ఆ దినమే విశ్రాంతి దినమని, దేవుడు తన స్వరూపమందు ఆయన పోలికతో నరులను చేశాడని, అప్పుడు మనిషి మంచీ చెడ్డలను తెలుసుకుని దైవ స్థాయికి ఎదిగిపోయాడని, ఆయనలోని ఒకటి వంటివాడాయేను అని, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవిస్తాడే మోనన్న బెంగ దైవానికి పట్టుకుందని….అందుకే ఆది మానవుడైన ఆదామును స్వర్గలోకం నుండి వెళ్ళగొట్టడం జరిగిందని బల్లగుద్ది బాహటంగా, ఘంటారావంగా చెప్పుకు తిరిగేవారు నేటికి మానవ సమాజంలో ఉన్నారు అంటే  ఆశ్చర్యం ఎంత  మాత్రం  కాదు. వారేదో నాస్తికులై ఉంటారనుకోకండి. వారు దైవం, ధర్మం మీద నమ్మకంతో జీవించేవారే. అదీ విచిత్రం!! ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:

‘‘ఏ మానవ మాత్రునితోనూ, అల్లాహ్ (ముఖాముఖిగా) సంభాషించడం అనేది జరగదు. వహీ  (దివ్యావిష్కృతి) ద్వారా లేదా పరదా వెనుక నుంచీ లేదా ఒక దూతను పంపడం ద్వారా తప్ప’’. (షూరా: 51)

‘‘నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని, (ఘోరమైన నిందను) తెచ్చారు. (దైవం విషయంలో) వారు చేసే వాదన (ఎంత తీవ్రమైనదంటే) దాని కారణంగా ఆకాశాలు పగలి, భూమి బ్రద్దలై, పర్వతాలు తుత్తునియలైపోతాయేమో!’’. (మర్యమ్‌: 89-92)

అంటే- వారి ఈ విధమైనటువంటి అపవాదుకు మిన్ను విరిగి మీద పడవచ్చు. భూమి భయంకరంగా ప్రకంపించవచ్చు. పర్వతాలు బద్దలైపోవచ్చు. వాస్తవం ఏమిటంటే – ‘‘ఆకాశాలలో, భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే. వారందరినీ ఆయన చుట్టు ముట్టి ఉన్నాడు. అందరినీ పూర్తిగా లెక్క పెట్టి ఉంచాడు. వారంతా ప్రళయ దినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు’’. (మర్యమ్‌: 93-95)

దైవాన్ని ప్రత్యక్షంగా చూస్తేగానీ విశ్వసించము అన్న వాదనలు కొన్ని మనకు కన్పిస్తాయి, విన్పిస్తాయి. ఇకపోతే దైవాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న ఆకాంక్ష ఆది నుండి ప్రతి మనిషిలోనూ ఉంది. ఇదే విషయాన్ని ప్రవక్త ముసా (అ) అల్లాహ్ తో విన్నవించుకున్నప్పుడు ఆ పరమోన్నత ప్రభువు ఇలా సమాధానమిచ్చాడు.

అతను (మూసా) ‘‘నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్యం కల్పించు. నేను ఓసారి నిన్ను చూసి తరిస్తాను’’  అని విన్నవించుకోగా, ‘‘ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నన్ను చూడలేవు’’ అయితే అదిగో! ఆ కొండ వైపు దృష్టిని సారించు. అది గనక యధాస్థితిలో ఉండగలిగితే నువ్వు నన్ను చూసే ఆస్కారం ఉంటుంది’’ అని ఆయన సెలవిచ్చాడు. ఆ తర్వాత అతని ప్రభువు తేజస్సును ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునియలు చేసేసింది. అంతే మూసా స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, (ప్రభూ!) ‘‘నీవు పరమ పవిత్రుడవు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాప పడుతున్నాను. అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను’’ అని మనవి చేసుకున్నాడు‘‘. (ఆరాఫ్‌: 143)

అంటే-  ఓ అల్లాహ్! నీ ఔన్నత్యాన్ని, నీ శక్తిని అంగీకరిస్తున్నాను. నేను ఆశక్తుణ్ణనీ, ఇహలోకంలో నిన్ను చూడగలిగే శక్తి నాలో లేదు. మరే మానవుడునూ నిన్ను చూడజాలడు అని గ్రహించాను అన్నది మూసా (అ) మాటల్లోని ఆంతర్యం.

అనగా ఇహలోకంలో ఎట్టి పరిస్థితిలోనూ, ఎవరునూ, ఎప్పుడునూ ఆయన స్వరూపమును చూడలేదు. ఇహలోకంలో అల్లాహ్ ను భౌతిక నేత్రాలతో చూసే శక్తి ఎవరికీ లేదు కూడా. మరి దైవాన్ని మనం ఎన్నటికీ చూడలేమా? అనంటారా! ఇహలోకంలో మాత్రం ఖచ్చితంగా  చూడలేము. అయితే పరలోకంలో అల్లాహ్ ప్రసన్నతను పొంది ఆయన కృపాకటాక్షాలతో స్వర్గానికి వెళ్ళే సౌభాగ్యవంతులు ఆయన్ను దర్శించుకుంటారు. అల్లాహ్ తన దర్శనభాగ్యం నిమిత్తం  వారి కంటి చూపులో మరింత శక్తినిస్తాడు. తత్ఫలితంగా కళ్ళు దైవ దర్శన జ్యోతికి  తట్టుకోగలుగుతాయి. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కోంటంది: ‘‘ఆ రోజు ఎన్నో ముఖాలు (ఆహ్లాదంగా) తాజాగా దేదీప్యమానంగా (మెరిసిపొతూ) ఉంటాయి. తమ ప్రభువు దర్శనాభాగ్యంతో తాదాత్మ్యం చెందుతుంటాయి’’. (ఖియామహ్: 22,23)

విశ్వాసుల ముఖాలు తమ సత్పరిణామం పట్ల హర్షాతిరేకంతో విప్పారుతాయి. వారి చెంపకెంపులు కాంతిలీనుతూ ఉంటాయి. దానికి తోడు దైవదర్శన భాగ్యం వల్ల వారి ఆనందానికి అవధులు ఉండవు. ఎంత వరకంటే- ఒకే ఒక్క దైవ దర్శనంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి కానీ వారికి స్పృహే ఉండదు. స్వర్గ సౌఖ్యాలను రుచి చూశాక, భూలోక కష్టాలను, సుఖమయ జీవితాన్ని మరచిపోయిన విశ్వాసులు, దైవదర్శనంతో స్వర్గ సౌఖ్యాలనే మరచిపోతారు. ఎంత మనోహరం ఆ దృశ్యం!!

అట్టి మహోన్నత ప్రభువు దర్శనంతో తరించాలనుకుంటున్నారా? అయితే ఆయన ఏమంటున్నాడో వినండీ!

‘‘కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవారు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో ఏ ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించకూడదు’’. (కహఫ్‌: 110)

అంటే – సత్కార్యం మనిషి ఐహిక జీవితాన్ని శాంతిమయం చేస్తే, ఏకదైవారాధన మనిషి పరలోక జీవితాన్ని సఫలీకృతం చేస్తుంది. దీనికి భిన్నంగా దుష్కర్మలు మనిషి ఐహిక జీవితాన్ని నరకప్రాయం చేస్తే, షిర్క్‌, బహుదైవారాధన మనిషి పరలోక జీవితాన్ని  సర్వ నాశనం చేస్తుంది. కారుణ్య ప్రభువైన అల్లాహ్ ఈ దుష్టపోకడల నుంచి మనందరినీ రక్షించుగాక! (ఆమీన్‌).

 

సయ్యిద్‌ అబ్దుస్సలామ్‌ ఉమరీ