July 27, 2024

5000 మందిపై అధ్యయనం చేసిన అమెరికన్‌ వైద్యుడు జెఫ్రీ వెల్లడి

చనిపోయాక ఏమవుతుంది? సినిమాల్లో చూపించినట్లు మన శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోతుందా? అది స్వర్గ నరకాలకు వెళ్తుందా? అసలు స్వర్గ నరకాలనేవి ఉన్నాయా? మన ఆత్మల్ని తీసుకెళ్లడానికి యమభటులో… లేక స్వర్గం నుంచి దేవతలో వచ్చి తీసుకెళ్తారా? చాలామందికి వచ్చే సందేహాలివి.

మరణానంతర జీవితంపై మనిషి ఆసక్తి ఈనాటిది కాదు. ఈ అంశంపై శాస్త్రజ్ఞులు, వైద్యుల అధ్యయనాలూ కొత్తవి కావు. మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చిన కొందరు… ఆ సమయంలో తమ ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిందని, గాడాంధకారం అలుముకొని ఉన్న సొరంగం లాంటి దాంట్లోంచి ప్రయాణిస్తే ఎక్కడో చివర కాంతిపుంజం కనపడిరదని చెప్పిన కథనాలు చాలానే వచ్చాయి. వీటిని ‘నియర్‌ డెత్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌’ అంటారు. అలాంటి అనుభవం కలిగిన 5వేల మందికిపైగా వ్యక్తులపై అధ్యయనం చేసిన అమెరికన్‌ వైద్యుడు (రేడియేషన్‌ అంకాలజిస్ట్‌) డాక్టర్‌ జెఫ్రీ లాంగ్‌… మరణానంతర జీవితం కచ్చితంగా ఉందని… అందులో ఏ మాత్రం సందేహం లేదని బల్ల గుద్ది చెబుతున్నారు. వైద్య విద్యను అభ్యసించే సమయంలోనే… ఈ అంశంపై ఆసక్తి పెంచుకున్న డాక్టర్‌ జెఫ్రీ 1998లో ‘నియర్‌`డెత్‌ ఎక్స్‌పీరియెన్స్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌’ను స్థాపించారు. కోమాలో ఉన్నవారు, క్లినికల్లీ డెడ్‌ అయినవారు, హృదయ స్పందనలు ఆగిపోయి… వైద్యుల ప్రమేయంతో బతికి బట్టకట్టినవారిలో ఈ తరహా ‘నియర్‌ డెత్‌ ఎక్స్‌పీరియెన్స్‌’లు ఎక్కువగా ఉంటాయని ఆయన చెబుతున్నారు. ఆ సమయంలో వారందరికీ కలిగే అనుభవాలు దాదాపు ఒక్కటి గానే ఉంటాయని తన అధ్యయనంలో వెల్లడైనట్లు జెఫ్రీ తెలిపారు. తాను అధ్యయనం చేసినవారిలో దాదాపు 45% మందికి ‘ఔటాప్‌ బాడీ ఎక్స్‌పీరియెన్స్‌’… అంటే శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి తనను తాను చూసుకోవడం, చుట్టూ జరిగే వాటిని చూడగలగడం, అక్కడ ఉండే వ్యక్తుల మాటలు వినగలగడం వంటి అనుభవాలు కలిగినట్టు ఆయన వెల్లడిరచారు. స్పృహ వచ్చిన తర్వాత… ఆ సమయంలో తాము చూసిన, విన్న విశేషాల గురించి వారు చెప్పిన మాటలన్నీ నిజమేనని అక్కడ ఉన్నవారు ధ్రువీకరించిన ఘటనలనూ ఆయన రికార్డ్‌ చేశారు. అలాగే… నియర్‌ డెత్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కలిగిన మరికొందరు చెప్పిన దాని ప్రకారం ఆ సమయంలో వారు మరో లోకంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుందట. ఒక సొరంగం గుండా ప్రయాణించడం… చివర్లో ఒక కాంతిపుంజం కనిపించి, గతంలో మరణించిన తమ ఆప్తులను అక్కడ కలుసుకోవడం వంటివి చాలా మంది చెప్పినట్టు జెఫ్రీ తెలిపారు. ఆ సమయంలో తమ జీవితం మొత్తం కళ్ల ముందు ఫ్లాష్‌ అయినట్టు కొంతమంది చెప్పారని ఆయన వెల్లడిరచారు. వర్జీనియా యూనివర్సిటీలో సైకియాట్రీ అండ్‌ న్యూరో బిహేవియరల్‌ సెన్సెస్‌ ప్రొఫెసర్‌ ఎమెరిటస్‌ అయిన డాక్టర్‌ బ్రూస్‌ కూడా ‘నియర్‌ డెత్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌’ విషయంలో డాక్టర్‌ లాంగ్‌తో ఏకీభవిస్తున్నారు. ఆయనను ‘ఫాదర్‌ ఆఫ్‌ ద రిసెర్చ్‌ ఇన్‌ నియర్‌ డెత్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌’గా వ్యవహరిస్తారు. ‘‘నాకు దొరికిన ఆధారాలను బట్టి… మనకు ఉన్నది ఈ భౌతిక శరీరం ఒక్కటే కాదు. భౌతిక శరీరం గతించాక కూడా కొనసాగేది ఏదో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అదేంటో మాత్రం నాకు తెలియదు’’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారాయన.

(ఆంధ్రజ్యోతి దినపత్రిక, 1 సెప్టెంబర్‌ 2023 సౌజన్యంతో…)